సుగుణోపాసన నిర్గుణోపాసనలో ఏది గొప్పది?
ఇతర మతాలకు హిందూమతానికి ఒక తేడా ఉంది. ఇతర మతాలలో ఏ ఆకారమూ లేని పరమాత్మను ఉపాసిస్తారు. వారికి దేవుడు ఫలానా ఆకారంలో ఉంటాడు అని విగ్రహాలను, చిత్రాలను రూపొందించుకెజిని పూజించడం అలవాటు లేదు. మనం మొదట ఏదో ఒక ఆకారంతో విగ్రహ రూపంలో కానీ, లింగ రూపంలో కానీ దేవాలయాలలో దేవుడిని ప్రతిష్ఠించి, పూజించి, క్రమక్రమంగా నిర్గుణోపాసన వైపుకు మళ్లుతాము. అంటే మొదట పూజలు చేస్తాము, దేవుడి విగ్రహాన్ని ఆరాధిస్తాము. నైవేద్యాలు పెడతాము. ఇంకా భక్తి కొద్దీ అభిషేకాలు, వ్రతాలు, ఉత్సవాలు ఇలా జరిపిస్తూ ఉంటాము. తరువాత అవన్నీ కాకుండా క్రమంగా దేవుడిని మనసులోనే భక్తిగా ఆరాధించడం, ధ్యానం, జపము చేయడం చేస్తాము. అయితే ఇక్కడ వచ్చిన చిక్కు ఏమిటంటే మనలో చాలామంది మొదటి మెట్టు మీదనే ఉండిపోతున్నాము. అంటే విగ్రహాలు ప్రతిష్టించడం,దేవాలయాలు కట్టించడం లేదా దేవాలయాలు దర్శించడం, వాటికి అలంకారాలు, పూజలు, నివేదనలు అన్నీ చేయించడం. అంతా అయ్యాక అవి మేమే చేయించామని గొప్పలు చెప్పుకోవడం, వీటి దగ్గరే అంటే మొదటి మెట్టుమీదనే ఆగిపోతున్నాము. రెండో మెట్టు ఎక్కడానికి కనీసం ప్రయత్నంకూడా చేయడం లేదు. రెండో మెట్టు ఏది అంటే నిర్గుణోపాసన. అంటే దేవుడు ఇలాగే ఉంటాడని కాకుండా అన్నింటిలో దేవుడు ఉన్నాడని అనుకోవడం. అయితే విగ్రహాలను పెట్టుకుని పూజించడం సరైనదా?? లేక దేవుడిని నిరాకారంగా అన్నింటిలోనూ ఉన్నాడని పూజించడం సరైనదా అని గీతలో ప్రస్తావించారు అర్జునుడు కృష్ణుడితో ఏ భక్తులైతే ఎప్పుడూ నీ మీద మనసు నిలిపి నిన్ను ఇదే ఆకారంతో ఉపాసిస్తున్నారో వారు యోగమును బాగా తెలిసిన వారా లేక అక్షరము, అవ్యక్తము అయిన పరబ్రహ్మమును ధ్యానించేవారు యోగవిత్తములా? వీరిలో ఎవరు శ్రేష్టులు నాకు వివరించండి అని అర్జుడు అడిగాడు. కృష్ణా! నువ్వునాకు ఎన్నో ఆకారములతో గూడిన నీ విశ్వరూపాన్ని చూపించావు. చూచాను. మరి ఇదివరకు నిన్ను నిరాకారంగా పూజించమని చెప్పావు. ఇప్పుడు సాకారంగా నీ విశ్వరూపాన్ని నాకు చూపించావు. ఇంతకూ నీ భక్తులు నిన్ను ఏదో ఒక ఆకారంతో పూజిస్తున్నారా లేక ఏ. ఆకారమూ లేకుండా నిరాకారంగా పూజిస్తున్నారా ఈ రెండింటిలో ఏది మంచిది? ఇలా చేసేవారిలో ఎవరు గొప్పవాళ్లు నాకు చెప్పు అని అడిగాడు. అంటే అర్జునుడు సగుణోపాసన గొప్పదా. నిర్గుణోపాసన గొప్పదా వీటి మధ్య ఉన్న తేడా ఏమిటి? ఏ విధంగా నిన్ను ఉపాసించే వాళ్లు గొప్ప వాళ్లు అని అడిగాడు. కొంచెం ఆలోచిస్తే ఈ ప్రశ్న వింతగా కనిపిస్తుంది. ఎందుకంటే ఏది గొప్పది, ఏది గొప్పది కాదు అని చెప్పడం రెండు సమాన ధర్మములు కలిగిన వస్తువుల మధ్యనే సంభవిస్తుంది. పైన చెప్పబడిన విషయాలను బట్టి చూస్తే ఇవి రెండుమెట్లు. మొదటి మెట్టు ఎక్కిన తరువాత రెండో మెట్టు ఎక్కాలి. అంటే మొదట సగుణోపాసన చేసి తరువాత నిర్గుణోపాసనకు చేరుకోవాలి. అంతే కానీ నేరుగా నిర్గుణా పాసన చేయడం కుదరదు. అలాగని కేవలం సగుణోపాసనలోనే ఉ ండి పోకూడదు. మొదటి అంతస్తు ఎక్కిన తరువాత రెండో అంతస్తుకు ఎక్కుతాము కానీ ఏకంగా నిచ్చెన వేసుకొని లేక తాడు ద్వారా రెండో అంతస్తుకు ఎక్కడానికి ప్రయత్నిస్తే, జారి, కిందపడి, నడుము విరుగుతుంది.
Read More
వ్యాసుని జననం వెనుక ఆశ్చర్యపరిచే కథ!
వేదవ్యాసుడు మహాభారతాన్ని రచించారు. ఈయన పాండవుల చరిత్రలో ఒక ప్రధాన పాత్ర పోషించారు. వ్యాసుడు రాసిన మహాభారతం గురించి అందరికీ తెలిసిందే. అయితే అసలు వ్యాసుడు ఎవరు?? ఆయన జననం ఎలా జరిగింది?? వంటి విషయాలు చాలా కొద్దిమందికే తెలుసు. వ్యాసుడి గురించి, ఆయన జననం గురించి ఆసక్తికరమైన కథ ఉంది. దాశరాజుకు మత్స్యగంధి అనే కూతురు ఉంది. అద్రిక అనే అప్సరస బ్రహ్మ శాపం వల్ల యమునా నదిలో చేపగా తిరుగుతున్నప్పుడు, ఉపరిచరవసువు వీర్యంవల్ల మత్స్యగంధి పుట్టింది. ఆమెను దాశరాజు కన్నబిడ్డలాగా పెంచుకొంటున్నాడు. చేపకడుపున పుట్టటం వలన మత్స్యగంధి శరీరం అంతా చేపవాసన కొడుతుండేది. అందువల్ల ఆమెనుమత్స్యగంధి అని పిలిచేవారు. ఆమె క్రమంగా పెరిగి పెద్దది అయ్యింది. దాశరాజు మత్స్యగందితో యమునానది మీద పడవ నడుపుతూ యాత్రికుల సేవ చేసుకోమని చెప్పాడు. తండ్రి చెప్పడం వల్ల మత్స్యగంధి ఆ పనిని ఎంతో శ్రద్దగా, భక్తిగా చూసుకునేది. ఒకరోజు వశిష్ఠమహర్షి మనుమడు, శక్తిపుత్రుడు, మహాతపస్వి అయిన పరాశరముని యమునానది దాటటానికి పడవరేవుకు వచ్చి మత్స్యగంధిని చూశాడు. ఆమె శరీర సౌందర్యం ఆ మహర్షి మనస్సును దోచుకొన్నది. అతడు తన కోర్కెను ఏకాంతంగా ఆమెకు తెలియజెప్పాడు. మునిమాట కాదంటే శాపమిస్తాడనే భయంతో పరాశరునితో మెల్లగా మత్స్యగంధి ఇట్లా అన్నది. ‘మహర్షీ! నేనెమో ఇంకా పెళ్లి కాని అమ్మాయిని. అందులోనూ నేను చేప కడుపున పుట్టడం వల్ల నా శరీరం అంతా చేపలకంపు వస్తుంది. మీరు అడిగిన దానికి నేను ఒప్పుకుంటే అప్పుడు తప్పు చేసినదాన్ని అవుతాను. తప్పు చేసి నేను మా నాన్న దగ్గరకు ఎలా వెళ్లగలుగుతాను?? కాబట్టి నాకు ఎలాంటి సమస్యా రాకుండా మీరు మీ శక్తి ఉపయోగించి ఏదైనా చేస్తే అప్పుడు మీ కోరిక తీర్చడానికి నాకేమీ సమస్య లేదు” అని చెప్పింది. పరాశరుడు ఆ మాటలు విని, సంతోషంతో ఆమె కన్యాత్వానికి లోపం లేకుండా వరమిచ్చాడు. ఆమె శరీరంలోని చేపలకంపు పోయి ఒక యోజనదూరం వరకూ పరిమళించే సుగంధాన్ని సహజశరీర వాసనగా ప్రసాదించాడు. దానితో ఆమె ‘గంధవతి’గా, ‘యోజనగంధి’గా పేరుపొందింది. ఆమెకు చివ్యాంబర భూషణాలు అందించాడు మహర్షి, పడవ నది మధ్యలో ఉన్న దీవికి చేరింది. పట్టపగలు బట్టబయలు ఎట్లా సంగమం సాధ్యం? అని అనుమానించింది యోజనగంధి. పరాశరుడు పట్టపగలును చిమ్మచీకటిగా మార్చాడు. ఆ ముద్దరాలి అనురాగాన్ని అనుభవించాడు. ఆమెకు సద్యోగర్భంలో సూర్యతేజుడైన వ్యాసుడు ఉదయించాడు. పుట్టగానే సద్యోయౌవనుడైనాడు. సమస్తజ్ఞానం ఆయనకు స్వాధీనమైనది. పరాశరుడు మత్స్యగంధికి మరికొన్ని వరాలిచ్చి వెళ్లిపోయాడు. నల్లని యమునాద్వీపంలో పుట్టటం వలనా, కృష్ణుడు అంటే నల్లనివాడు కావటంచేత వ్యాసుడు కృష్ణద్వైపాయనుడు అయినాడు. కృష్ణాజినం, కాషాయాలు, కపిలజడలు, దండకమండలాలు సహజంగానే ధరించి వ్యాసుడు తల్లికి నమస్కరించాడు. ‘మీకు నా అవసరం ఎప్పుడు ఉంటే అప్పుడు నన్ను తలుచుకొండి ఆక్షణమే మీ యెదుట ఉంటాను’ అని చెప్పి తపోవనానికి వెళ్లాడు. ఘోరతపస్సు చేసి, ఆత్మ సాక్షాత్కారాన్ని పొంది, చిక్కుపడి ఉన్న వేదాలను విడదీసి. లోకంలో వెలయించాడు వేదవ్యాసుడైనాడు. మహాభారతంలో తానూ ఒక పాత్రగా జీవించి చివరకు ఆ కావ్యాన్ని తానే రచించాడు. యోజనగంధి అసలు పేరు సత్యవతి. కౌరవ వంశ చరిత్రలో తరువాత కీలకపాత్ర నిర్వహించింది.
Read More